11.06.2021 వారం కథా కమామీషు
1.
అన్నింటా నేనే : బావమరిదిగదా
అని తనకు జరిగే సన్మానం గురించి అతడికి చెప్పాడు. అంతే అక్కడంతా తనకు
తెలిసినవాళ్ళేననీ తానూ వస్తానంటూ సన్మాన సభకు తయారయ్యాడు. అక్కడ ఎవరూ పిలవకున్నా
స్టేజీ పైకెక్కి తెలిసినవాళ్ళనీ, తెలియనివాళ్ళనీ తన మంత్రాలతో
ఆశీర్వదిస్తూ,
కెమెరాని
కవర్ చేసేశాడు. ఆ ప్రోగ్రాం తాలూకు ఫోటోలు చూసిన అతగాడికి కాగడా వెతికి చూసినా
సన్మానగ్రహీత అయిన తాను గానీ, సన్మానకర్తలు గానీ కనబడలేదు. అన్నింటా
తానే అన్నట్లుగా బావమరిది కనిపించటంతో అతనికి ఒళ్ళు మండిపోయింది. అతనికెలాగైనా
బుద్ధి చెప్పాలని ఆలోచిస్తుంటే అనుకోకుండా అతనికి బుద్ధి చెప్పే అవకాశం దొరికింది.
మరి తన బావమరిదికి అతను ఏరకంగా బుద్ధి చెప్పాడు? ఆపైన ఏం
జరిగింది? డాక్టర్
చక్రపాణి యిమ్మిడిశెట్టి హాస్య కథ ‘అన్నింటా నేనే’ ఈవారం సహరి
వీక్లీలో తప్పక చదవండి.
2.
అలా మొదలైంది : తన అక్క కూతురికి
వచ్చిన సంబంధం తాలూకు కుర్రాడు తనకు పరిచయం ఉన్నావిడ రెండో కొడుకు అని
తెలిసిందతనికి. కానీ ఆవిడకు ఒకే కొడుకని తెలిసిన అతడు తన అనుమానం తీర్చుకుందామని వెళ్ళి
ఆ పెళ్ళికొడుకు తల్లిని కలిశాడు. విషయం అడిగేసరికి ఆమె తన రెండో కొడుకు గురించి ఒక
కథ చెప్పింది. అది విని అతడి మతిపోయినంత పనైంది. అదంతా కట్టుకథ అని కొట్టేశాడు.
కానీ ఆవిడ తను చెప్పిన కథకి ఋజువుకూడా చూపించేసరికి కొయ్యబారిపోయాడు. తన కొడుకు
గురించి ఆవిడ చెబితే అతనెందుకలా రియాక్టయ్యాడు? ఆవిడ
చూపించిన ఋజువు అతడినెందుకు నిశ్చేష్టుడిని చేసింది? ఇంతకూ ఆ
సంబంధం ఓకే అయ్యిందా? కోటమర్తి రాధా హిమబిందు హృద్యమైన కథ ‘అలా
మొదలైంది’ తప్పక చదవండి.
3.
గోల్డెన్ డేస్ : రిటైర్మెంట్
వయసు రాగానే తన బిజినెస్ సామ్రాజ్యాన్ని కొడుక్కి అప్పగించేశాడు. అయినా ఒక్కక్షణం
కూడా వృధాగా పోనీయకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ హాయిగా కాలం గడపసాగాడు. కానీ ప్రాణానికి
ప్రాణమైన భార్య మరణించటంతో ఆయన మానసికంగా ఎంతగానో క్రుంగిపోయాడు. మునుపటిలా
ఉండటానికి ప్రయత్నించినా ఆరోగ్యం సహకరించకపోవటంతో ఒక గదికి పరిమితం చేయబడ్డాడు. మామగారికి
సేవలు చేయటానికి మనస్కరించని ఆయన కోడలు ఎలాగైనా ఆయన్ని వదిలించుకోవాలని అనుకుని, ఒక్క
వృద్ధాశ్రమం గురించి గొప్పగా చెప్పసాగింది. అక్కడ చేరితే ఆయనకన్నీ గోల్డెన్ డేసే
అని చెప్పింది. అది విని కొడుకు ఆయన్ని బయటికి తీసుకువెళ్ళటంతో ఇక ఆ రోజునుంచి ఆయన
బెడద వదిలినట్లే అనుకుని హాయిగా నిట్టూర్చింది. మరి ఆ కోడలి కోరిక నెరవేరిందా? ఆయన్ని
కొడుకు వృద్ధాశ్రమంలో చేర్చాడా? ఆయనకు గోల్డెన్ డేస్ ఎలా వచ్చాయి? గొర్లి
శ్రీనివాసరావు కథ ‘గోల్డెన్ డేస్’, తప్పక
చదవండి.
4.
మనసులోని కోరిక : ఆ ఇద్దరూ
ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పదిహేను రోజుల హానీమూన్ ఎంతో బాగా ఎంజాయ్ చేశారు.
భర్త తనపై చూపించే కన్సర్న్ ఆమెనెంతో సంతోషపరచింది. కొన్నాళ్ళ తర్వాత తమ బంధువుల
ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర్నుంచీ ఆమెకు భర్తపట్ల అసంతృప్తి మొదలైంది. ఇంట్లో ఎంతో
ప్రేమగా ఉండే అతడు అందరూ ఉన్నప్పుడు సాదాగా ఉండటం ఆమెకు నచ్చలేదు. తన మేనత్త
మేనమామల్లా అందరిలోనూ ఎంతో అన్యోన్యతతో ఉండవచ్చుకదా అని ఆమె బాధపడింది. మనసులోని
కోరికను భర్తకు చెప్పలేక ఇబ్బంది పడింది. మరి ఆమె కోరిక తీరిందా? లేదా భర్త
ప్రవర్తనే సరైనదని అనుకుందా? రసవత్తరమైన కథనంతో సాగిన పసుపులేటి
సత్యవేణి సరసమైన కథ ‘మనసులోని కోరిక’ తప్పక
చదవండి.
5.
నాన్నంటే... : దేశంలో ఎటు చూసినా
కరోనా విలయతాండవం చేస్తోంది. అయినా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అతనికి
ఉద్యోగానికి వెళ్ళక తప్పని పరిస్థితి. అప్పటికే అతని స్నేహితుడి కుటుంబం కరోనాకి
బలయ్యింది. ఎక్కడ ఆ రోగం తనకు అంటుకుంటుందో, తన పిల్లలు
అనాథలవుతారోనని అతడు చింతించసాగాడు. ఆ సమయం లో అతనికి రాజధానికి బదిలీ అయింది. భార్య, పిల్లలు
వారిస్తున్నా వెళ్ళక తప్పలేదు. అక్కడికి వెళ్ళిన కొన్నాళ్ళకు అతడు ఫోన్కు కూడా
అందకుండాపోయాడు. అతనేమయ్యాడో తెలీక ఆ కుటుంబం కంగారుపడింది. ఇంతకూ అతనేమయ్యాడు? అతను
భయపడ్డట్లే కరోనాకు బలైపోయాడా? పిల్లలపై తండ్రి ప్రేమను ఆర్ద్రంగా
వర్ణించిన విరించి కథ ‘నాన్నంటే...’ తప్పక చదవండి.
6.
ఓట్లు రాలు కాలం : అతనికి
చదువూ సంధ్యలు లేవు. అనేక రకాల అడ్డదారులు తొక్కి పైకొచ్చాడు. ఎన్నికల్లో నిలబడి
ఇంకా పైపైకి ఎదగాలని ఆశ పడ్డాడు. కానీ అతని ఆశను అడియాశ చేస్తూ అతన్ని కరొనా
అడ్డుకుంది. ఓట్లకోసం ఊర్లో తిరిగి జనాల్ని ప్రలోభపెట్టాలనుకున్న అతడు క్వారంటైన్లోకి
వెళ్లాల్సివచ్చింది. దాంతో అతడు కరోనాతో ప్రత్యక్షంగా తలపడ్డాడు. కానీ అది ఎంత
శక్తివంతమైనదో అతడికి తెలిసొచ్చింది. సక్రమంగా ఉంటానని దానికి మాట ఇచ్చినా, ఆ మాటమీద
నిలబడలేకపోయాడు. దాని పర్యవసానం ఏమిటి? ఉన్నత శిఖరాలను
అధిరోహించాలనే అతడి కోరిక నెరవేరిందా? కరోనా అతడికి
లొంగిపోయిందా?
అడుగడుగునా
హాస్య సంభాషణలతో కడుపుబ్బా నవ్వించే డా.రమణ యశస్వి హాస్య కథ ‘ఓట్లు రాలు
కాలం’
చదవండి.
7.
కిట్టీ పార్టీ : ఆ
కాలనీలోని మధ్యతరగతి మహిళామండలి సభ్యురాళ్ళంతా కలసి ఒక చిట్టీకి డబ్బు కట్టుకుని, నెలకొకరికి
ఆ మొత్తాన్నీ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా ఆ చిట్టీ డబ్బు పొందిన
స్త్రీ ఇంట్లో ఒక చిన్న కిట్టీ పార్టీ ఏర్పాటు చేసుకునేవారు. అలా జరిగే పార్టీలో
ఒకామె కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత ఆమె కనబడకుండాపోయింది. ఆమె ఏమైపోయిందో
తెలీక తోటి మహిళలంతా ఆందోళన చెందారు. దుర్మార్గుడైన ఆమె భర్తే ఆమెను అంతం
చేసివుంటాడని అనుమానించారు. తమకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా పరిశోధన
చేయించారు. ఆ పరిశోధన ఫలితం ఏమైంది? ఆ స్త్రీ నిజంగా చంపబడిందా? కథ ఏ మలుపు
తిరిగింది?
అత్యంత
ఆసక్తి రేకెత్తించే కథనంతో సాగిన తిరుమలశ్రీ కథ ‘కిట్టీ
పార్టీ’
తప్పక
చదవండి.
8.
మనిషి తత్త్వం : అతడంటే ఇంట్లో సింహస్వప్నం. అతడి నోటి
దురుసుకు భార్య భయపడేది. అతడంటే పిల్లలు గజగజా వణికిపోయేవారు. అలాంటివాడికి కరోనా
సోకింది. దాంతో ఇంట్లో అంతా అల్లాడిపోయారు. అది చూశాకగానీ అతడికి తను వాళ్ళపట్ల
ఎంత క్రూరంగా వ్యవహరించిందీ అర్ధం కాలేదు. వాళ్ళపట్ల తన ప్రవర్తనకు తానే
పశ్చాత్తాపపడ్డాడు. ఆ సాయంత్రం అతని కరోనా రిపోర్ట్ రాబోతోంది. ఆ రిపోర్ట్
పాజిటివే వస్తుందో, నెగిటివే వస్తుందోనని చాలా కంగారుపడ్డాడు. ఎట్టకేలకు
రిపోర్ట్ వచ్చింది. అందులో ఏముంది? అది చూసి అతని రియాక్షన్ ఏమిటి? మనిషి
అంతరంగపు లోతుల్ని స్పృశించిన ఇంద్రగంటి
నరసింహమూర్తి మైక్రో కథ ‘మనిషి తత్త్వం’ తప్పక
చదవండి.