మీనాక్షి శ్రీనివాస్
స్వపరిచయం : మీనాక్షీశ్రీనివాస్. స్వస్థలం కాకినాడ.
జననీ, జనకులు... కీ.శేలు. శ్రీమతి మహీధర వేంకట దుర్గాంబ, శ్రీ మహీధర వేంకటరామ దీక్షితులు.
జీవితభాగస్వామి శ్రీయుతులు శ్రీనివాస్, ఇద్దరు కుమారులు, కోడళ్ళు, మనుమరాలు, మనుమడు.
కథల ప్రయోజనం సమాజపరంగా, ఉన్నత విలువలతో కూడిన వ్యక్తిత్వం పెంపొందించేవిగా ఉండాలన్నదే నా నమ్మకం, ఆశ. ఆంధ్రాబ్యాంక్ (యూనియన్ బ్యాంక్) విశ్రాంత అధికారిణిని. విశాఖ రేడియో కేంద్రంలో, డ్రామా ఆర్టిస్ట్ గా ఎంపికయి, కొన్నేళ్ళపాటు కొనసాగి, బదిలీల కారణంగా విరమించడం జరిగింది. ఏడు రేడియో నాటికలు, సుమారు 330 పైగా కథలు అన్ని పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్నింటికి బహుమతులు వచ్చాయి. 22 కథల సంపుటి 'నిశీథిలో నక్షత్రం' అక్టోబర్ 2016 లో వెలువడింది. నా రచనలు కొన్ని కథానిలయంలో (కోడ్ 2295) చోటు కల్పించిన కారా మాష్టారికి నా నివాళి.
మరచిపోలేని అనుభూతి, 03 ఏప్రిల్ 2024 న లేఖినీ సంస్థవారు, డాక్టర్ వాసాప్రభావతి గారి పేరిట, వారి అమ్మాయి జఠావల్లభుల మీనాక్షిగారిచే పొందిన మాతృవందన పురస్కారం
ఇప్పటికి 19 నవలలు చతుర, ఆంధ్రభూమి, స్వాతి మొదలగు పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీటిలో ఐదు అపరాధ పరిశోధక నవలలు. బహుమతి పొందిన 'భద్ర' నా తొలి మినీ నవల (20).
రెండవ సంపుటి తపస్వీమనోహరం కథల పోటీలో విజేతగా, బహుమతి కథలు ఏడింటితో బాటు నా కథలు మరో పద్దెన్మిది కలిపి 'బహుమతి' 2024 నవంబర్లో ప్రచురించడం జరిగింది.
వారే నా అపరాథ పరిశోధక నవల 'రామాపురం బంగ్లా' డిసెంబర్ 2025 లో ప్రచురించారు.
వంగూరి చిట్టెన్ రాజుగారి సాహితీ సమావేశాల్లో రెండుసార్లు ఓసారి కాకినాడ, మరోసారి ఖతార్ లలో పేపర్ ప్రెజెంటేషన్ మరువలేని మరో అనుభూతి.
పద్యరచనలో ఓనమాలు శ్రీమతి నండూరి సుందరీనాగమణిగారు, శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మగారి వద్ద దిద్దాను. క్లుప్తంగా ఇదీ నా సాహితీ ప్రస్థానం.
***