కోటమర్తి రాధా హిమబిందు
Story writer
కోటమర్తి రాధా హిమబిందు
శ్రీమతి కోటమర్తి రాధా హిమబిందు జన్మించింది సూర్యాపేట జిల్లా కోదాడ. భర్త రవీందర్ ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లా మణుగూరులో ఉండి జిల్లాకు తన సాహితీ సేవలను అందించారు. ప్రస్తుతం కె.ఎల్.ఆర్ ఎవెన్యూ కోమరబండ కోదాడలో నివాసం ఉంటున్నారు.
శ్రీమతి కోటమర్తి రాధా హిమబిందు గారు తన రచన వ్యాసంగాన్ని ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయింది. వారి సాహిత్య ప్రస్థానంలో ఇప్పటివరకు 350 కి పైగా కథలు, నాలుగు నవలలు రాశారు. అందులో రెండు ఎమ్మెస్కో వారు ప్రచురించారు. ఆంధ్రప్రభ వార పత్రికలో సీరియల్ గా వచ్చిన ప్రవాహంలో ప్రయాణం నవలగా ప్రచురించారు. వనిత పత్రికలో వచ్చిన పంజరం సీరియల్ కూడా నవలగా ప్రచురితమైంది. తెలుగు భాషలో వెలువడుతున్న అన్ని దిన, వార, పక్ష మరియు మాస పత్రికల్లో వీరి కథలు, నవలలు ప్రచురింపబడ్డాయి. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే చందమామ అయినా, కార్మికుల పత్రిక కార్మికలోకం అయినా, అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు సృజించి అక్షర రూపంలో పాఠకులకు అందజేశారు.
శ్రీమతి రాధా హిమబిందు గారి కథల్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలు ప్రస్తావిస్తుంటారు. వారి రచనల్లో పాత్రలు మన చుట్టూ ఉండే మనుషులు, సంఘటనలు పాఠకులను బాగా మెప్పిస్తాయి. కడుపుబ్బ నవ్వించే హాస్య కథలూ, కళ్ళ నీళ్లు తెప్పించే హృద్యమైన కథలు వీరి కలం నుండి వెలువడ్డాయి.
శ్రీమతి రాధా హిమబిందు గారు రచయిత్రిగా ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందారు.
2005, 2006, 2007 సంవత్సరాలలో జి.వి.ఆర్ కల్చరల్ ఫౌండేషన్, హైద్రాబాద్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీల్లో మూడుసార్లు ఉత్తమ రచయిత్రిగా గెలుపొంది శ్రీ త్యాగరాయ గానసభలో సన్మానం పొందాను.
2006లో ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఉత్తమ రచయిత్రిగా గుర్తించి సత్కరించింది.
2007లో ప్రభుత్వం నిర్వహించిన స్తంభాద్రి సంబరాలల్లో ఉత్తమ రచయిత్రిగా అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి రేణుకా చౌదరి ద్వారా అప్పటి రాష్ట్ర మంత్రి వనమా వెంకటేశ్వరరావు, అప్పటి కలెక్టర్ శశిభూషణ్ కుమార్. మరియు శాసనసభ్యుల సమక్షంలో అవార్డు, సన్మానం పొందారు.
2008లో సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ నది మాస పత్రికలో రాసిన ‘ వీళ్ళనేంచేద్దాం’
అనే నవలకు ముగింపు రాసి ఏకైక బహుమతి పొందారు.
2010 లో వంగూరు ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీల్లో ఉత్తమ రచన అవార్డు పొంది జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు, సన్మానం అందుకున్నారు.
2011 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ “సేవా” ద్వారా సన్మానం పొందారు.
ఇవి కాకుండా ఈనాడు ఆదివారం అనుబంధం పత్రికలో అనేక కథలు ప్రచురితమై బహుళ ప్రజాదరణ పొందాయి. స్వాతి, నది, ఆంధ్రజ్యోతి, ఇంకా ఇతర పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో పలుమార్లు బహుమతులు గెల్చుకున్నారు.
శ్రీమతి రాధా హిమబిందు గారు రేడియో మాధ్యమం ద్వారా కూడా అనేక కథలు, కథానికలు, నాటకాలు, నాటికలు రచించారు. ఇవన్నీ ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కొత్తగూడెం కేంద్రాల నుండి ప్రసారం అయ్యాయి. మహిళల కోసం “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే 16 వారాల ధారావాహిక నాటికను రచించారు. ఆకాశవాణి రేడియో నాటికల సప్తాహం సందర్భంగా “ప్రేమా! నీ పేరు మార్చుకో” అనే నాటకం 2007లో ప్రసారం అయింది. ఈనాటికను ప్రశంసిస్తూ కొన్ని వందల ఉత్తరాలు రావడం విశేషం. రాధా హిమబిందు గారు రచయిత్రి మాత్రమే కాదు, మంచి గాయని కూడా. వారు పాడిన పాటలు కొత్తగూడెం, విజయవాడ కేంద్రాల నుంచి ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం “బి” గ్రేడ్ కళాకారిణిగా ఆకాశవాణి, దూరదర్శన్ లో కొనసాగుచున్నారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ వారు నిర్మించిన రెండు లఘు చిత్రాలకు కథ, మాటలు సమకూర్చారు. కార్మికుల శ్రేయస్సు కోరుతూ నిర్మించిన “గులాబీ ముళ్ళు” మరియు అనుకోని ప్రమాదం వల్ల భర్త మంచాన పడ్డప్పుడు తన సమస్యలను ఎలా అధికమించిందో తెలిపే ఓ మహిళ కథ “గమ్యం”. ఈ రెండూ కూడా కార్మిక కుటుంబాలలో బహుళ ప్రజాదరణ పొందాయి.
2012 డిసెంబర్ లో 4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఖమ్మం లో జరిగిన జిల్లా స్థాయి సన్నాహక కార్యక్రమంలో జిల్లా ఉత్తమ రచయిత్రిగా గజల్ శ్రీనివాస్ గారి ద్వారా సన్మానం అందుకున్నారు. తర్వాత ఆరు సంవత్సరాలలో కథల పోటీల్లో అనేక బహుమతులు సాధించారు.
2018 డిసెంబర్ లో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురించిన కథలను “ఆరిళ్లలోగిలి” పేరుతో కథ సంకలనం వెలువరించారు. 2020 లో “శ్రీమతి కోటమర్తి రాధా హిమబిందు కథలు” పేరుతో రెండో సంకలనం విడుదల అయింది. 2022 ఏప్రిల్ 6 పుడమి సాహితీ వేదిక ద్వారా “బిఆర్ అంబేద్కర్ స్మారక జాతీయ పురస్కారం అందుకున్నారు. అదే సంవత్సరం జూన్ లో “తెలంగాణ ఆణిముత్యం” పురస్కారం మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు సాంస్కృత అకాడమీ మరియు వేదిక సీసీటీవీ ఆధ్వర్యంలో “నంది పురస్కారం” అందుకున్నారు. జూలైలో రవీంద్రభారతిలో మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో “ఇండియన్ అచీవర్” అవార్డు మరియు జనవరి 2023లో తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన కార్యక్రమంలో “నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్” 2022 2023 సంవత్సరానికి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు.
2025 ఆగస్టులో హైదరాబాదులోని రవీంద్రభారతిలో స్వర్గీయ గిడుగు రామమూర్తి గారి జయంతి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు వెలువరించిన “ఆరిళ్ల లోగిలి” కథా సంకలనానికి జాతీయ పురస్కారం లభించింది.
2025 డిసెంబర్ లో “హరిదా రచయితల సంఘం” నిజామాబాద్ హరిదా సరస్వతి రాజ్ సాహిత్యోత్సవం సందర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ భాషలో రాసిన “గునుగుపూలు” అనే కథకు ‘ అంతర్జాతీయ కథా రచన’ పురస్కారం లభించింది.
కోవిడ్ 19 ఫలితంగా అనేక పత్రికలు మూతపడిన పరిస్థితుల్లో వారు డిజిటల్ గా కథా రచన ప్రారంభించి అనేక ఆన్ లైన్ పత్రికలకు తమ రచనలు పంపిస్తున్నారు. వాటిలో అనేక కథలకు బహుమతులు, నగదు పురస్కారాలు లభించాయి.
***** *****